జమ్మూకాశ్మీర్లో నంద్యాల జిల్లాకు చెందిన జవాన్ వీర మరణం పొందారు. ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో పాములపాడు మండలం మద్దూరు మజరా కృష్ణానగర్కు చెందిన సురేంద్ర ప్రాణాలు కోల్పోయా. 2019లో సైన్యంలో చేరిన సురేంద్ర.. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లోని బారాముల్లా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. సురేంద్ర ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం ఇచ్చారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు విషాదంలో ఉన్నారు. బుధవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.మద్దూరుకు చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో కుమార్తెకు వివాహంకాగా.. ఎకరా పొలం సాగు చేస్తూ ఇద్దరు కుమారులను బాగా చదివించారు. పెద్ద కుమారుడు సుమన్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నారు.. చిన్న కుమారుడు సురేంద్ర డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ వెలుగోడులో పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుకుగా ఉండేవాడు. అలా 2019లో ఆర్మీలో చేరారు. 4 నెలల క్రితం కూడా సెలవుపై ఊరొచ్చి రెండు నెలలు కుటుంబసభ్యులతో గడిపారు.సురేంద్ర తరచూ కుటుంబసభ్యులతో ఫోన్లో, వీడియో కాల్లో మాట్లాడుతూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఆదివారం రోజు తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి సెలవులు ఇచ్చారని.. సెప్టెంబర్ నెలాఖరులో ఇంటికొస్తానని ఆనందంగా చెప్పారు. సోమవారం ఉదయం కూడా తండ్రి సుబ్బయ్య బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు జమ చేశాడు. ఇంతలోనే తండ్రి సుబ్బయ్యకు ఆర్మీ అధికారులు ఫోన్ చేసి కుమారుడి మరణం గురించి చెప్పారు. నంద్యాల జిల్లాకు చెందిన జవాన్ సురేంద్ర జమ్మూకాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవాన్ వీర మరణం పొందారు. ఈ మేరకు తల్లిదండ్రులకు ఆర్మీ నుంచి సమాచారం అందింది. వచ్చే నెలలో ఊరొస్తానని తల్లికి చెప్పిన సురేంద్ర.. సోమవారం తండ్రి అకౌంట్కు డబ్బులు జమ చేశారు. ఇంతలోనే సురేంద్ర మరణవార్త విని కుటుంబసభ్యులు, ఊరి ప్రజలు తీవ్ర విషాదంలో ఉన్నారు.
